– ఇప్పటికే సారీ చెప్పానన్న మాజీ మంత్రి
– ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడాలన్న కమిషన్
– క్షమాపణను అంగీకరిస్తూ రిపీట్ కావొద్దని వార్నింగ్
– కార్యాలయం బయట కాంగ్రెస్ మహిళా నేతల ధర్నా
– బూట్లతో తన్నారని ఆరోపించిన సునీతా రావు
Women Commission: కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్టీసీ బస్సులు పెంచి మహిళలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. మహిళా కమిషన్ కలుగజేసుకుని కేటీఆర్ను వివరణ కోరుతూ నోటీసులు పంపింది. దీంతో శనివారం ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు.
కేటీఆర్ వెర్షన్
రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా హజరయ్యానని అన్నారు కేటీఆర్. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశానని, దానిపై కమిషన్కు వివరణ ఇచ్చానని తెలిపారు. దీనిపై సంతృప్తి చెందారో లేదో తరువాత చెప్తామని చెప్పారన్నారు. మహిళల పట్ల తనకు గౌరవం ఉందని, చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. 8 నెలల్లో కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన సంఘటనలను మహిళా కమిషన్కు అందజేయడానికి ప్రయత్నం చేశానన్న కేటీఆర్, అన్ని వివరాలను తాను కమిషన్కు వివరించినట్టు చెప్పారు.
కమిషన్ వార్నింగ్
కేటీఆర్ వివరణ తర్వాత మహిళా కమిషన్ ప్రెస్నోట్ విడుదల చేసింది. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారని తెలిపింది. తన స్థాయికి ఆ మాటలు సరికాదని కేటీఆర్కు అనిపించి సారీ చెప్పారని వివరించింది. ఆయన క్షమాపణను అంగీకరిస్తున్నామని, కాకపోతే భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అలా కాదని రిపీట్ అయితే మాత్రం, సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది మహిళా కమిషన్.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్
కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు నిరసనకు దిగారు. మహిళ కమీషన్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా భారీగా తరలి వచ్చారు. ఇరు పార్టీల నేతలు పొటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. గేటు బయట కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బెఠాయించగా, గేటు లోపట బీఆర్ఎస్ మహిళా నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పరిస్థితి విషమించకుండా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షరాలు సునీతా రావుని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కేటీఆర్ అలా.. సునీతా రావు ఇలా!
కమిషన్ విచారణ తర్వాత మాట్లాడిన కేటీఆర్, తమ పార్టీ నేతలపై దాడి జరిగిందన్నారు. ఇలాంటివి మంచిది కాదని, తమ వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. తర్వాత గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన సునీతా రావు, కేటీఆర్పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ మహిళలను కించపరిచేలా మాట్లాడారని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఆయన్ను బయట తిరగనివ్వమని హెచ్చరించారు. కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని, మహిళా కమిషన్ కేటీఆర్పై సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక, తన అరెస్ట్ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తమను జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆరోపించారు. వారిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.