బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్లారు … శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వారంతా హస్తినకు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ హస్తిన పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి వెళ్తున్నారు సరే.. మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు.. ..ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు..అనేదానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇరుక్కుని.. అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు ఆమె బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ అన్ని చోట్లా ఎదురు దెబ్బలే తగిలాయి. మరోవైపు.. చెల్లిని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కేటీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఇటీవలే ఆయన హరీష్రావుతో కలిసి ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు మకాం వేసి వచ్చారు. పలువురు న్యాయనిపుణులతో చర్చించి.. బెయిల్ కోసం ప్రయత్నించినా ఏదీ వర్కవుట్ కావట్లేదు.
సుప్రీంకోర్టులో మంగళవారం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన బృందంతో ఢిల్లీకి పయనమయ్యారు …ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్.. లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో.. గులాబీ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. జులై ఒకటిన కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ నెల 20న దానిపై విచారించిన న్యాయస్థానం ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వాయిదా వేసింది. మరి కొద్ది గంటల్లో దానిపై విచారణ జరగనుండటంతో.. కచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశిస్తోంది.
Also Read: హైదరాబాద్లో డ్రైవర్ లెస్ కారు.. అందులో మొదటగా ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు
లిక్కర్ స్కామ్ కేసులో పలువురు అప్రూవర్లుగా మారగా.. మరికొందరికి బెయిల్ వచ్చింది. కవిత మాత్రం మార్చి-15న అరెస్ట్ అయి నాటి నుంచీ తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ సారి కూడా ఒకవేళ ఆమెకు బెయిల్ రాని పక్షంలో.. అందరికీ బెయిల్ ఇచ్చి.. కవితకు మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదని సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది ..అందుకే కేటీఆర్ తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను, పార్టీ నేతల్ని హస్తినకు తీసుకెళ్లారన్న చర్చ జరుగుతోంది. అదేం కాదు ఎమ్మెల్యేలు కారు దిగిపోకుండా కాపాడుకోవడానికే కేటీఆర్ జాగ్రత్తపడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది.
మరోవైపు.. కవిత అనారోగ్యంతో ఉండటంతో బెయిల్ ఖచ్చితంగా వస్తుందంటున్నారు. గత వాయిదా సమయంలోనే కేటీఆర్, హరీష్రావులు ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారన్న ప్రచారం జరిగింది. రాజ్యసభ నలుగురు సభ్యులున్న తమ పార్టీని బీజేపీలో విలీనం చేసి.. కవితకు బెయిల్ తెచ్చుకోవడానికి చర్చలు జరిపారన్న టాక్ నడిచింది. మరి ఈ సారి కూడా చుక్కెదురైతే గులాబీ నేతల యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.