KTR : మంత్రి కేటీఆర్ పెద్దమనసు ఓ ఇంటికి కొండంత అండగా నిలిచింది. ముగ్గురు కూతుళ్లు అంగవైకల్యంతో బాధపడుతూ.. వారికి చికిత్స అందించలేక ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడకు చెందిన వెంకటయ్య, శంకుతల దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ అంగవైకల్యంతో బాధపడుతున్నారు.
వారికి చికిత్స చేయించి ఆర్థికంగా చితికిపోయింది ఆ కుటుంబం. ఐనా కూతుళ్లకు నయం కాలేదు. దీంతో తాము చనిపోవాలనుకుంటున్నామని.. తమను ఆదుకోవాలని ఆ ఆడ బిడ్డలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మీరు ఎంతో మందికి సహాయం చేశారు.
వీళ్లకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సహాయం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు. దీంతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్.. బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు చికిత్సకు అవసరం అయిన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి మంత్రి కేటీఆర్ చొరవతో ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని నింపింది.