Dharmapuri Arvind : తెలంగాణ ఎన్నికల్లో ఒకొక్కరి రంగు బయటపడుతోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. దానికి ఈరోజున అక్షర సత్యం చేసింది ఎంపీ అరవింద్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై ఆయన పాజిటివ్ గా మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్, కేటీఆర్, ఇంక కవిత అంటే లెక్కేలేదు, వీరిపై ఎప్పుడు చూసినా నిప్పుల కుంపటి తొక్కినట్టుగా మాట్లాడే నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ టోన్ సడన్ గా మారిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న అరవింద్ … సీఎంగా కేసీఆర్ మేలంటూ ఆయనపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన అరవింద్.. తమ అసలు రూపాన్ని బయట పెట్టారనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
‘ఆహా…ఏమి సెప్తిరి…ఏమి సెప్తిరి’ అంటూ అరవింద్ పై నెట్టింట సెటైర్స్ పేలుతున్నాయి. నిన్నొక మాట, నేడొక మాట, రాజకీయ నాయకుడికి ఎంపీ అరవింద్ నిలువెత్తు నిదర్శనమని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఎంపీ అరవింద్ ది నరం లేని నాలుక, అదేమన్నా మాట్లాడుతుందని పేర్కొంటున్నారు. అరవింద్ మాటలపై కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. అంతెత్తున లేస్తున్నాయి.
ఇన్నాళ్లూ గంప కింద కోడిపెట్టల్లా బీఆర్ఎస్, బీజేపీ కూర్చున్నాయి. ఎన్నికలు దగ్గర పడే సమయంలో మేమంతా ఒకటేనని నిరూపించారు. మీ బుద్ధి చూపించారని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల వేళ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోరని అరవింద్ కి కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఒక్కసారి ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ స్టాండ్ తీసుకునేసరికి ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా చేసిన సంసారం వీధిలో పెట్టినట్టయ్యిందని సీనియర్లు అంటున్నారు. వాళ్లంతా కలిసిపోయారని, ఏకమై పోయారనే సంగతిని అరవింద్ బయటపెట్టాడని చెబుతున్నారు.
ఈ ప్రసంగాల్లో కేసీఆర్ను ధర్మపురి తిట్టినప్పటికీ.. ఇలా కాంగ్రెస్ను పోల్చుతూ చెప్పిన మాటలనే.. చాలా మంది సోషల్ మీడియాల్లో వైరల్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడంతా డబుల్ గేమ్ నడుస్తోందని, అదీరోజున ఓపెన్ అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో గా డిబేట్లు జరుగుతున్నాయి.
ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా పెట్టేబేడా సర్దుకొని రెడీగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ల ప్రయాణం ముగిసింది. ఇంకో వారం రోజుల్లో అంటే డిసెంబర్ 3న వాళ్లు దిగాల్సిన స్టేషన్ వస్తుంది. ట్రైన్ దిగి అందరూ ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండమని సూచిస్తున్నారు.