ములుగు జిల్లాలోని జంపన్న వాగు. కొండాయి దగ్గర వాగుపై ప్రమాదకరరీతిలో బ్రిడ్జి ఉంది. కొండాయి బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితిపై.. జూలై 22న బిగ్ టీవీ జనతా గ్యారెజ్లో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. తగు చర్యలు తీసుకోమని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తోలుమందం అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కొండాయి బ్రిడ్జిని మరమ్మత్తులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితం.. తాజా వరదలకు బ్రిడ్జి కుప్పకూలిపోయింది. 8మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
ఎంత దారుణం? ఎంతటి నిర్లక్ష్యం? ఆ బ్రిడ్జి ప్రమాదంలో ఉందని బిగ్ టీవీ ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు పాలకులు. ప్రజలంటే, వారి ప్రాణాలంటే అంతటి చిన్నచూపు వారికి. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు.
భారీ వరదకు కొండాయి బ్రిడ్జ్ కూలింది. వంతెన కూలటంతో 8 మంది గల్లంతయ్యారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఒకరి గల్లంతయ్యారు. వంతెన కూలడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి.
బిగ్ టీవీలో ఆ బ్రిడ్జిపై ప్రత్యేక కథనం ప్రసారమైన వారానికే ఈ ప్రమాదం జరిగింది. బిగ్ టీవీ హెచ్చరికతోనైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి ఉంటే బాగుండేది. కనీసం రాకపోకలు నిషేధించినా ముప్పు తప్పేది. ఇప్పుడు ఇంతటి ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు.
సర్కారు ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం ఇప్పుడు జనం ప్రాణాలను తీసింది. మరి, ఈ మృత్యుఘోషకు కారకులెవరు? పట్టించుకోని ప్రభుత్వమా? చేతకాని అధికారులా? బిగ్ టీవీ నిగ్గదీసి అడుగుతోంది. సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది?