Konda surekha comments, Hero Nagarjuna Petition in nampally court: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ మేరకు ఈ కేసుపై హైదరాబాద్లోని నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే తన స్టేట్మెంట్ తెలిపేందుకు మంగళవారం కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది.
నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నేడు నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు. కాగా, నాగార్జునతోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
హీరో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను విమర్శించే క్రమంలో హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేశారని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు.
హీరో నాగార్జున తన పరువుకు భంగం కలిగిందంటూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాజ్యంపై మంగళవారం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున, సమంతతో పాటు సినీ రంగ ప్రముఖులంతా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు.
Also Read: గాంధీభవన్లో మంత్రి తుమ్మల ముఖాముఖీ
తమ రాజకీయ ప్రయోజనాల కోసం సినీ పరిశ్రమలోని వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని పలువురు సినీ రంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించింది. అయినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.