కొమురవెల్లి మల్లికార్జునస్వామి నిజరూప దర్శనాన్ని నిలిపివేయనున్నారు. జనవరి 1 సోమవారం సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వచ్చే శుక్రవారం అనగా.. జనవరి 7 నుంచి కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణంలో పాటు జాతర నిర్వహించనున్నారు. అయితే జాతర సందర్భంగా ఆలయంలో శుద్ధికార్యక్రమాలు, సుందరీకరణ పనులు జరగనున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి, అమ్మవార్ల విగ్రహాలను అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు దర్శనాన్ని నిలివేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉంది. కానీ మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్ణయాన్ని మార్చినట్లు వివరించారు. జనవరి 2 ఉదయం నుంచి అర్థ మండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కొమురెల్లి మీసాల మల్లన్న దేవాలయం జాతరకు ముస్తాబవుతోంది. మల్లన్న కల్యాణంతో మొదలు కానున్న జాతర.. అగ్ని గుండాలతో ముగుస్తుంది. పూర్వం 11వ శతాబ్దంలో యాదవ కులస్థుడైన కొమురన్నకు కలలో స్వామి వారు కనిపించి ఇంద్రకీలాద్రిపై తాను వెలసి ఉన్నానని చెప్పగా, అక్కడికి చూసేసరికి బండ సోరికల్లో పుట్టమన్నుతో స్వామివారి దర్శనం కనిపించింది. నాబి యందు లింగమున్నట్టు చరిత్ర చెబుతోంది. తెలంగాణలో జానపదుల జాతరైన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న స్వామి క్షేత్రం పడమటి శివాలయం. దేశంలో ఎక్కడైన తూర్పు, ఉత్తర దిశలో ఆలయాలు ఉండటం సహజం. ఇక్కడ మాత్రం పడమర దిశకు ఉండడంతో ఇక్కడ పూజలు చేస్తే అపార శక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మల్లన్న ఆలయ క్షేత్రం చుట్టు అష్టబైరవులు ఉన్నారు. ఇందులో ఒకటి ఆలయ గర్భగుడిలో ఉండడంతో దర్శించుకునే భక్తులకు దుష్టశక్తుల నుండి స్వామి రక్షిస్తాడని నమ్మకం.
కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు దేశంలో ఎక్కడ జరుగని విధంగా జరుగుతాయి. స్వామివారి కల్యాణంతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారంతో పట్నం వారంతో ప్రారంభమై మహశివరాత్రికి పెద్ద పట్నంతో సాగుతూ ఉగాది ముందు ఆదివారంతో అగ్నిగుండాల వారంతో ముగుస్తుంది. స్వామి వారు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఓ వైపు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాడు. మరో వైపు ఆలయ గంగిరేగు చెట్టు వద్ద తెలంగాణ జానపదుల తరహలో పంచవర్ణ ముగ్గులతో పట్నాలు వేసి భోనాలు చెల్లించడం ఆనవాయితీ. ఇక్కడ భక్తులు పట్నాలు వేయడం అంటే స్వామికి కల్యాణం చేయడమని అర్థం. ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు కొమురవెళ్లి పుణ్యక్షేత్రం వరంగల్ జిల్లాలో ఉండేది. కాబట్టి కాకతీయ రాజుల కాలం నాటి దేవాలయంగా కూడా మల్లన్న గుడి ప్రాచుర్యంలో ఉన్నది. కాకతీయరాజులు శివ భక్తులు కాబట్టి రామప్ప, వేయి స్తంభాల దేవాలయలు శివుని ఆలయాలు. అందుకే కొమురవెళ్లి ఆలయం కూడా కాకతీయ కాలం నాటి దేవాలయంగా చరిత్ర చెబుతోంది.
మల్లన్న దేవుడు యాదవుల ఆడపడుచు గొల్లకేతమ్మను పెళ్లి చేసుకోవడంతో యాదవులు, కుర్మలు, గోల్లవారికి ఇంటి దైవంగా పూజలు చేస్తారు. మల్లన్న దేవుడు రెడ్డి వంశస్తుడిగా, రాజుగా భావించిన కొందరు మున్నూరు, రెడ్డి కులస్తులు స్వామి వారిని ప్రతి ఏటా దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. అందుకే దేవాలయంలో 2 రకాల పూజలు నిర్వహిస్తారు. గర్భాలయంలో మూల విరాట్కు వీరశైవ శాస్త్రం ప్రకారం లింగ బలిజాలు పూజలు నిర్వహించగా, ఆలయ గంగరేగుచేట్టు వద్ద పంచ రంగుల పట్నాలు వేసి యాదవ పూజారులు పూజలు నిర్వహిస్తారు. రంగులతో పూజించే ఆనవాయితీ, ఆచారం ఈ ఒక్క దేవాలయంలోనే ఉంది. మల్లికార్జున స్వామి వారికి ఎల్లవేళలా రక్షణగా గొడుగు వలె సర్పాలు తలపై ఉంటాయి. ఒక చేత కత్తి, మరొక చేత డమరుకం ఉండి దేహాన్ని అంతా సర్పాలు, హారాలుగా ఉండడం ప్రత్యేకత .
గతంలో కొమురవెల్లికి ఉగాదికి తలుపులు పడుతాయని అదే సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారు. ఇప్పుడు మాత్రం ఏడాది పాటు మొక్కులు చెల్లిస్తూ నిత్య కల్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతోంది. మల్లన్న ఆలయానికి ఏటా సుమారు 15 కోట్ల ఆదాయం వస్తోంది. కొమురవెళ్లి మల్లన్నను సుమారు 70 లక్షల మంది ఏటా దర్శించుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.