Tigers Death Mystery: రాష్ట్రంలో సంచలనం రేపిన పులుల మృతి మిస్టరీ వీడుతోంది. పులులు వరుస మృతిని తీవ్రంగా పరిగణించింది నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో దృష్టి సారించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర అటవీశాఖ అధికారులు.. పకడ్బందీగా విచారణ నిర్వహించాలని ఆదేశించారు. పులుల హత్య కోణంలో పలు బృందాలు దరిగాం, షెర్కపల్లి, రింగ్రేట్, చోపన్గూడ, లైనుగూడతో పాటు పలు గ్రామాల్లో విచారణ చేపట్టాయి. మరోవైపు అటవీప్రాంతంలో మిగతా పులుల ఆచూకీ, వాటి పరిస్థితి తెలుసుకునేందుకు అటవీశాఖ బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.
దరిగాం, షెర్కపల్లి అటవీ ప్రాంతాల సమీపంలో పశువులపై పులుల దాడులు తీవ్రమయ్యాయి. రైతుల కళ్లముందే తమ పశువులను దాడి చేయడంతో తీవ్ర ఆవేదన గురయ్యారు. ఇక పులుల నుంచి తమ పశువులకు ముప్పు పొంచివుందని భావించిన పశువులు పులిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే దాడి చేసి హతమార్చిన పశువును తినడానికి మళ్లీ పులి వస్తుందని తెలిసి ఆ పశువు కళేబరంపై పురుగుల మందు చల్లారు. వరుస పులల మృతితో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. పులుల హత్యకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా షెర్కపల్లి అటవీప్రాంతం సమీపంలోని గ్రామాలకు వెళ్లిన అధికారులు.. మొదట ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న అధికారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురిని అధికారులు అడవిలోకి తీసుకెళ్లి.. పులులకు విష ప్రయోగం చేసి ఆహారాన్ని తింటున్నప్పుడు ఎక్కడి నుంచి చూశారు.. ఎలా వీడియో తీశారు.. అనే విషయాలపై సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశారు. పశుకళేబరంపై విషం చల్లిన తర్వాత .. ఆ డబ్బాను పడేసిన ప్రాంతంతో పాటు వారు వచ్చి వెళ్లిన మార్గాన్ని అధికారులకు చూపించినట్లు తెలిసింది.
ఈ పులుల జాడను ట్రాక్ చేసేందుకు కాగజ్నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్తో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నుంచి ట్రాకర్ల బృందాలను రప్పించారు. తొలుత మృతి చెందినట్లు గుర్తించిన ఎస్-15 పులి ఇంకో పులితో పోరాడి చనిపోయినట్లు చెప్పిన అధికారులు.. ఇప్పుడు ఆ పులి సైతం విషప్రయోగంతోనే మరణించి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం ఆరు పులుల్లో రెండు చనిపోగా, మూడు సురక్షితంగా ఉన్నాయనుకుంటే, మరో పులి ఏమైందన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ ఆరు పులుల్లో ఒకటి ఎప్పటి నుంచో తల్లిని వదిలేసి వేరుగా సంచరిస్తున్నదని, విషం తిన్న పులుల్లో అది ఉందా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది.
పులులు మృతిచెందిన ఘటనలో కాగజ్నగర్ అటవీ డివిజన్లోని ఓ కీలక అధికారిపై తీవ్ర స్థాయి ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట మృతిచెందిన కే15 పులి ఘటనలో అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో.. ఉన్నతాధికారులు కూడా సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి పులి మృతికి ఘర్షణ పడడమే కారణమని ఏకపక్షంగా సమాచారం ఇచ్చేందుకే సదరు అధికారి ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ రేంజ్ అధికారి రమాదేవి పులుల కదలికలను గుర్తించే క్రమంలో.. దరిగాం ప్రాంతంలో కే15 పులి కళేబరం బయటపడింది. సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడని అధికారిపై అటవీశాఖలో చర్చ కొనసాగుతోంది. ఇదే అధికారి పెంచికల్పేట్ రేంజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. ఐదేళ్ల క్రితం ఫాల్గుణ అనే పులి మృతి చెందింది. ఈ ఘటనలో సైతం సమాచారం బయటకు రానివ్వకుండా వ్యవహరించారనే చర్చ ఉంది. కానీ ఫాల్గుణ మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.
అనుమానితులగా పశువుల కాపరులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో.. తమవారిని చూపించాలని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఆయా గ్రామస్తులు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు.. అదుపులో ఉన్నవారిని కలిసేందుకు అనుమతించారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటంతో బయటకు పంపించారు. బయటకు వచ్చిన మైనర్లు.. తమను ఇష్టంవచ్చినట్లు కొట్టారని..భయంతో చేయని తప్పును ఒప్పుకున్నట్లు వేలిముద్రలు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అదుపులో ఉన్నవారందరినీ బట్టలు విప్పి కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మైనర్లు.