Komatireddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకప్పుడు కరుడుకట్టిన కాంగ్రెస్ వాది. మరి, ఇప్పుడు? కాంగ్రెస్ ను ఆగమాగం చేస్తున్న నిత్య అసంతృప్తవాది. ప్రస్తుతం ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేవు ఆయనకి. సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి, మునుగోడులో ఓడటంతో కోమటిరెడ్డి కుటుంబానికి ఇక రాజకీయ సమాధినే అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వెంకట్ రెడ్డి.. తాను మునగడమే కాకుండా.. కాంగ్రెస్ నూ పూర్తిగా ముంచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారనే విమర్శ ఉంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి వచ్చిందో.. అప్పటి నుంచీ ఆయన తీరు ఇలానే ఉందని అంటున్నారు.
గడిచిన 9 నెలల కాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన రాజకీయ రచ్చ అంతాఇంతా కాదు. అంతా రేవంత్ టార్గెట్ గానే. అన్నీ కాంగ్రెస్ ను కష్టాల్లోకి నెట్టేసేవే. పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నారని.. మునుగోడులో కాంగ్రెస్ కు ఓటేయవద్దని.. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. లేటెస్ట్ గా తెలంగాణలో హంగ్ తప్పదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కల్లోలం పరాకాష్టకు చేరింది. వెంకట్ రెడ్డి క్షమించరాని తప్పు చేశారని కాంగ్రెస్ వాదులంతా ముక్తకంఠంతో మండిపడుతున్నారు. ఇదే ఛాన్స్ గా బీజేపీ సైతం ఆ రెండు పార్టీలు దొందుదొందేనంటూ మరింత రెచ్చిపోతోంది. ఇంత చేసి.. కోమటిరెడ్డి ఏం సాధించినట్టు? ఆయన టార్గెట్ ఎవరన్నట్టు?
కాంగ్రెస్ సినిమా క్లైమాక్స్ పై పక్కా క్లారిటీతో ఉన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ లో తాను పీసీసీ చీఫ్ అయ్యేది లేదు.. గెలిచినా తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చేది లేదు. ఈ విషయంపై మంచి అవగాహనే ఉంది ఆయనకి. తనకు కాకుండా పోయింది మరెవరికీ దక్కకూడదనే దురుద్దేశంతోనే ఇలా కాంగ్రెస్ ను ఆగం చేసే కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రతో రేవంత్ రెడ్డి యమ జోరు మీదున్నారు. ఆయన యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ప్రగతి భవనే షేక్ అవుతోంది. బీజేపీ నేతలు సైతం కంగు తింటున్నారు. బండి సంజయ్ పాదయాత్రకంటే కూడా రేవంత్ యాత్రకు భారీగా జనం వస్తుండటంతో కమలనాథులు డిఫెన్స్ లో పడుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. కావాలనే కోమటిరెడ్డి హంగ్ అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారనేది కాంగ్రెస్ వాదుల ఆక్రోషణ.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారనే విషయం ఓపెన్ సీక్రెట్. వరుసబెట్టి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పేసుకున్నారు. ఈపాటికే ఈయనా కప్పేసుకునే వారే. కానీ, మునుగోడు బై పోల్ లో బీజేపీ ఓటమితో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డట్టున్నారు. సమయం వచ్చినప్పుడు వద్దువు గానీ.. అప్పటి వరకూ కాంగ్రెస్ లోనే ఉండు.. ఆ పార్టీని మాగ్జిమమ్ డ్యామేజ్ చేయి.. అంటూ బీజేపీ అగ్రనేతల నుంచి మెసేజ్ వచ్చినట్టుంది.. అందుకే ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు కస్సుమంటున్నారు. కోమటిరెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని.. తక్షణమే వేటు వేయాలంటూ పట్టుబడుతున్నారు. మరి, అధిష్టానం ఏం చేస్తుందో?