Komatireddy Venkat Reddy: తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ మరో పార్టీతో కలవాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ సెక్యులర్ పార్టీలని, కాంగ్రెస్తో కేసీఆర్ కలవక తప్పదని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతును కేసీఆర్ తీసుకోవాల్సిందేనని తెలిపారు. దీంతో పార్టీ అధిష్టానం కోమటిరెడ్డిపై ఆగ్రహంగా ఉంది.
ఈక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని వీఐపీ లాంజ్లో ఈ సమావేశం జరిగింది. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన మాటలను వక్రీకరించారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిందే.. తాను రిపీట్ చేశానని వెల్లడించారు. సెక్యూలర్ పార్టీలతోనే పొత్తు అని చెప్పానని చెప్పారు. మీడియా తన మాటల్ని వక్రీకరించిందని మండిపడ్డారు. బీజేపీ ఆ విషయాన్ని రాజకీయం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్లో చిన్న చిన్న వాళ్లు కూడా మాట్లాడుతున్నారని.. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితి ఏంటన్నదే తాను చెప్పానని వివరించారు. ఈ విషయాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారో తెలియట్లేదన్నారు.