Komatireddy Venkat Reddy : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవనాన్ని నిర్మిస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉమ్మడి ఏపీకి సంబంధించిన పలు ఆస్తులను పరిశీలించారు. ఆ ఆస్తులపై అధికారులను ఆరా తీశారు. 19 బ్లాక్ల్ ల వివరాలను అధికారులు మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు.
అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ దేశ రాజధానిలో తెలంగాణ భవన్ లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావస్తున్నా తెలంగాణ భవన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల వివరాలను ముఖ్యమంత్రికి వివరిస్తానన్నారు.
రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రత్యేక హోదా కల్పించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాకు తన మద్దతు ఉంటుందని అందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు.