Komatireddy: కోమటిరెడ్డి కాంగ్రెస్ను వీడుతున్నారు.. బీజేపీలో చేరుతున్నారు.. ఇన్నాళ్లూ జరిగిన ప్రచారం ఇది. లేటెస్ట్గా మరో కొత్త టాక్. ఆయనే సొంతంగా పార్టీ పెడుతున్నారట. ఓ మీడియాలో బాగా ప్రమోట్ అవుతోంది ఆ విషయం.
కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వనందున.. సీడబ్ల్యూసీ సభ్యత్వమైనా ఇవ్వాలంటూ హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారని అంటున్నారు. CWC ఇస్తే కాంగ్రెస్లో కంటిన్యూ అవుతా.. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తానంటూ లీకులు ఇస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. విషయం కోమటిరెడ్డి గురించి కావడంతో.. అయితే అయ్యుంటుందనే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాదులు.
అయితే, ఎప్పటిలానే ఈ వార్తలను ఖండించారు ఎంపీ. తాను కాంగ్రెస్ను వీడటం లేదని.. కొత్త పార్టీ కూడా పెట్టట్లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. పార్టీ మారే ఉద్దేశముంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనప్పుడే మారే వాడినన్నారు. కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర పెద్దలను కలవడంపైనా వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ.. దేనికి పోటీ చేయమంటే దానికి పోటీ చేస్తానని చెప్పారు.