Komatireddy : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారా? ఆయన బీజేపీలో చేరడం లాంఛనమేనా? తమ్ముడి బాటలో అన్న వెళుతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ కానుండటం ఆసక్తిని రేపుతోంది. అభివృద్ధి పనుల కోసం చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పటికే కోమటిరెడ్డి కోరారు. మోదీతో భేటీకి శుక్రవారం ఉదయం 11 గంటలకు రావాలని పీఎంవో నుంచి ఆయనకు సమాచారం అందింది.
మూసీ ప్రక్షాళన కోసం నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధానిని కోమటిరెడ్డి కోరతారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. మెట్రో, ఎంఎంటీఎస్ కు సంబంధించి పలు అంశాలపై ప్రధానితో చర్చిస్తారని సమాచారం.హైదరాబాద్- విజయవాడ హైవేతో సహా ప్రధాని దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లతారని వార్తలు వస్తున్నాయి. మోదీతో భేటీ తర్వాత కోమటిరెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పీసీసీ కమిటీలో పదవి దక్కకపోవడంతో ఖర్గేతో భేటీ అయ్యారు. ఏఐసీసీ స్థాయిలో పదవి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఒక రోజు వ్యవధిలోనే కోమటిరెడ్డికి ప్రధానితో భేటీకి అపాయింట్ మెంట్ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొంతకాలంగా తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేశారు. సోదరుడి కోసం ఆయన పనిచేశారని విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనలేదు. ఎన్నికల ముందు వారం రోజులు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
పీసీసీ కమిటీ కూర్పు తర్వాత అసంతృప్తిని కోమటిరెడ్డి వెళ్లగగ్గారు. తాను నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతానికేతే కాంగ్రెస్ కండువా ఉందని అని అప్పుడు సూచనప్రాయంగా పార్టీ మార్పుపై హింట్ ఇచ్చారు. తనకు పదవులు కొత్త కాదని.. మంత్రి పదవిని వదులుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ అన్నీ పార్టీని వీడేందుకేనని అంటున్నారు.
సోదరుడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. ఖర్గే ఇచ్చిన హామీపై వెంకట్ రెడ్డి సంతృప్తి చెందలేదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు పేరిట ప్రధాని మోదీతో భేటీకానున్న…దీని వెనుక వేరే ఉద్దేశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధానికి బీజీ షెడ్యూల్ ఉంటుంది. అయినా సరే ఓ కాంగ్రెస్ ఎంపీకి అపాయింట్ మెంట్ దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. మరి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి చేరేందుకు సిద్దమైనట్టేనా? వేచి చూడాలి మరి.