Komatireddy : కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని తేల్చేశారు. ఏ పార్టీ 60 సీట్ల మెజార్టీ మార్కును అందుకోలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్లో వివిధ కారణాల వల్ల సీనియర్ నేతలు ఓకే వేదికపైకి రాలేకపోతున్నారని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు బాగా కష్టపడితే 40 స్థానాల వరకు దక్కుతాయన్నారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ మరో పార్టీతో కలవాల్సిందేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ సెక్యులర్ పార్టీలని, కాంగ్రెస్తో కేసీఆర్ కలవక తప్పదని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతును కేసీఆర్ తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
పాదయాత్ర రూట్ మ్యాప్పై పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకుంటానని కోమటిరెడ్డి చెప్పారు. తాను స్టార్ క్యాంపెయినర్నని.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతానని ప్రశ్నించారు. మార్చి 1న పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. తాను పార్టీని గెలిపిస్తాను అంటే మిగిలిన నేతలు ఇంట్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కొత్తయినా, పాతయినా గెలిచేవాళ్లకే సీట్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.