తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. అందుకే రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించదని తెలిపారు.
రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచనకు గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లన్నర రుణమాఫీ చేయలేదని తెలిపారు. కానీ ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటన చేసి మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వడ్డీల పేరుతో బ్యాంకుల రైతుల నడ్డి విరిచాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. రైతులకు మేలు చేస్తున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని కానీ రైతులు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.