వరద బాధితులకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు.
వరద ప్రభావంతో దెబ్బతిన్న ఇతర గ్రామాలకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెన, రోడ్లను పరిశీలించారు. కలెక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కేంద్ర బృందాలు సోమవారం తెలంగాణకు వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. వరద నష్టం వివరాలు సేకరిస్తాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం అందించాలన్నారు. రాష్ట్ర సర్కార్ వద్ద ఉన్న రూ.900 కోట్ల విపత్తు నిధులను బాధితులకు సాయం చేసేందుకు వాడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.లక్ష ఇస్తాయని తెలిపారు.
వరద నష్టం అంచనా వేసేందుకు మొత్తం 8 శాఖల అధికారుల కేంద్రం బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని బృందం సోమవారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుంది. ఈ టీమ్ లో ఆర్థిక, వ్యవసాయ, జలశక్తి,విద్యుత్, రోడ్డు రవాణా, స్పేస్ డిపార్ట్మెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అధికారులు ఉంటారు.