Kishan Reddy: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్ ఇవ్వడంతో బీజేపీలో జోష్ పెరిగింది. ఏకంగా సిట్ దర్యాప్తునే రద్దు చేయడం.. కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. తమ పార్టీ కీలక నేత బీఎల్ సంతోష్ ను ఇరికించాలని చూశారని.. కానీ, సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పేరుతో తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఫాంహౌస్ కేసులో హైకోర్టు తీర్పు కేసీఆర్కు చెంపపెట్టులాంటిదన్నారు కిషన్ రెడ్డి. ఫాంహౌస్ ఘటన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో ఎందుకు బంధించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ల డేటాను ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. అబద్ధాలు, గారడీ చేయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపాడని.. ఫాంహౌస్ పేరుతో కుట్రలకు పాల్పడ్డారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా కేసీఆర్ సర్కార్ తీరులో మార్పు రావడం లేదన్నారు. ఇతర పార్టీలపై బురద జల్లడం బీఆర్ఎస్ కు అలవాటేనని తప్పుబట్టారు.
బురదలో నుంచే కమలం పువ్వు వికసిస్తుందని.. కానీ కమలానికి ఎలాంటి బురద అంటదని కిషన్ రెడ్డి అన్నారు. ఫాం హౌస్ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.