Kishan Reddy today news(Political News in Telangana): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన ముందు ప్రస్తుతం అనేక సవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో సమన్వయ లోపం, పదవులు దక్కని అసంతృప్తులు, పాత–కొత్త నేతల మధ్య భేదాభిప్రాయాలను సరిదిద్దడం ఓ పెద్ద టాస్క్ కాగా.. అధికార బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కొంటూ, విమర్శలను తిప్పికొడుతూ పార్టీని ముందుకు దూకించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఆయన నెత్తిపై ఉంది. ముంచు కొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా కిషన్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రంలో బీజేపీని విజయతీరాలకు నడిపించేందుకు ఆయనకు ఉన్న సమయం కూడా కేవలం నాలుగైదు నెలలు మాత్రమే.
ఇంత తక్కువ సమయంలోనే పార్టీని చక్కదిద్ది, ఎన్నికలకు సిద్ధం చేయడం కత్తిమీద సామేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అన్నింటికన్నా ముందు ఎల్లుండి ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయడం కిషన్రెడ్డి ముందున్న ఫస్ట్ బిగ్ టాస్క్ అని చెప్పాలి. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ డీలా పడింది. పార్టీలో అయోమయ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కేడర్లో మళ్లీ కొత్త ఊపు తీసుకురావడం కిషన్ రెడ్డి చేతిలో ఉంది. దాదాపు నాలుగేళ్లుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్న కిషన్రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించాల్సి ఉంది.
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గం, పదాధికారులు, జిల్లా అధ్యక్షుల మార్పు వంటి సంస్థాగత చర్యలు కిషన్రెడ్డికి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అధ్యక్ష మార్పు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్కు కీలక పదవి ఇవ్వడంపై పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడం, పార్టీ మారకుండా చూడటంపైనా కిషన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.