Khammam: ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్. నిజంగానే లక్షలాది మంది ప్రజలు సభకు తరలివచ్చారు. వేదికపై నలుగురు సీఎంలు, ఓ మాజీ సీఎం ఆసీనులయ్యారు. అంతా మంచి స్పీచ్ ఇచ్చారు. కేసీఆర్ గ్రేట్ అని, కంటి వెలుగు కార్యక్రమం బాగుందని.. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ బహు బాగుందని ప్రశంసించారు. వచ్చిన ఆహ్వానితులంతా.. పిలిచినందుకు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. సభ సక్సెస్ అయిందని అనిపించారు.
అంతేనా? ఇంకేం లేదా? అనే చర్చ మొదలైంది. వచ్చారు.. హెలికాప్టర్ లో తిరిగారు.. యాదాద్రి సందర్శించారు.. ఖమ్మం వెళ్లారు.. సభలో మాట్లాడారు.. కేంద్ర బీజేపీని తిట్టిపోశారు.. ఇంతేనా? ఇంకేం లేదా? అంటున్నారు.
అనుకున్నదొక్కటి అయింది ఇంకొకటి. ముగ్గురు సీఎంలు ఎక్కడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. కనీసం బీఆర్ఎస్ ను స్వాగతించలేదు. కేసీఆర్ జాతీయ నాయకుడు అని కూడా చెప్పలేదు. కేసీఆర్ వెంటే మేమంతా అని కూడా అనలేదు. కేసీఆర్ తో కలిసి పని చేస్తామని గానీ.. కేసీఆర్ కింద పని చేస్తామని కానీ.. క్లారిటీ ఇవ్వలేదు. ఎవరి సొంత స్పీచ్ లు వారు ఇచ్చారే కానీ.. ఎక్కడా బీఆర్ఎస్ గురించి కానీ, కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కానీ.. మాట్లాడలేదు. దేశ్ కి నేత.. అంటూ తనకు తాను తెగ ప్రమోట్ చేసుకుంటున్న గులాబీ బాస్ ను.. ఆ వేదికపై ఆసీనులైన ఏ ఒక్కరు కూడా కేసీఆర్ ను ‘దేశ్ కీ నేత’.. అంటూ కితాబు ఇవ్వలేదు.
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనేది సామెత. అలానే.. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్.. కేసీఆర్ అనుకున్నది అట్టర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఖమ్మం సభ ఎందుకోసం పెట్టారో అర్థం కావట్లేదంటున్నారు. కేసీఆర్ స్పీచ్ సైతం చప్పగా ఉందని చెబుతున్నారు. పాత క్యాసెటే మళ్లీ రిపీట్ చేశారని.. కొత్తగా ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పలేదని తీసిపడేస్తున్నారు. బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచీ చెబుతున్న మాటలే.. మళ్లీ ఖమ్మం సభలో చెప్పారని.. అందుకే సభ తుస్ మందనే టాక్ నడుస్తోంది.