Khairatabad Ganesh Shobhayatra: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. తీన్ మార్ డప్పులు, డీజే డ్యాన్సులతో బడా గణేష్ నిమజ్జనానికి భక్తులు తరలి వెళ్తున్నారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 రోజు పూజలు అందుకున్న మహాగణపతిని నేడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. 40 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని.. మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 వద్ద గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది.
బాలాపూర్ లడ్డూవేలంపై ఉత్కంఠ
మరోవైపు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది. జై బోలో గణేశ్ మహరాజ్ కి… అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. 11వ రోజు గణపతికి పూజా కైంకర్యాలు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభంకానుంది. గత ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలుకగా.. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర ఎంత పలుకుతుందోనన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాదితో బాలాపూర్ లడ్డూ వేలం పాటకు 30 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1994 నుంచి బాలాపూర్లో వినాయకుని చేతిలో ఉంచిన లడ్డూని వేలం పాడుతున్నారు. మొదటిసారి లడ్డూ వేలం రూ.450 పలుకగా.. రెండో ఏడాది రూ.4500 పలికింది. ఏడాదికేడాది లడ్డూ వేలం పెరుగుతూనే వస్తోంది.
Also Read: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!
ఇక్కడ లడ్డూ వేలం పాడాలంటే గత ఏడాది వేలం ధరను ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఇక్కడ పెట్టిన కొత్త నిబంధన ఇది. ఈసారి బాలాపూర్ గ్రామస్తులే కాకుండా బయటి వ్యక్తులు కూడా వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. మొత్తం 23 మంది వేలంలో పాల్గొననుండగా.. ఈసారి లడ్డూని ఎవరు దక్కించుకుంటారా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.