Congress: కోమటిరెడ్డి పని అయిపోయిందన్నారు. టీపీసీసీ కమిటీల్లో వెంకట్ రెడ్డి పేరు లేకపోవడంతో.. ఇక వేటు వేయడమే తరువాయి అంటున్నారు. పొమ్మనలేక పొగబెట్టారని.. రేపో, మాపో పోవడమో.. పంపడమో పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఊహాగానాల మధ్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాక్ ఇస్తూ.. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఆసక్తికర పరిణామం.
లోపల ఏం మాట్లాడుకున్నారనే దానిపై పలు రకాల లీకులు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లినా.. వెంకట్ రెడ్డి మాత్రం పార్టీనే నమ్ముకోవడాన్ని ఖర్గే అభినందించినట్టు తెలుస్తోంది. ఇక, టీపీసీసీ కమిటీల్లో సీనియర్లకు చోటు దక్కకపోవడాన్ని అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారట కోమటిరెడ్డి. తనకు సైతం ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే, కోమటిరెడ్డికి ఖర్గే బంపర్ ఆఫర్ వచ్చినట్టు చెబుతున్నారు. ఏఐసీసీ లోకి వెంకట్ రెడ్డిని తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. కోమటిరెడ్డి పంట పండినట్టే. రేవంత్ రెడ్డికి ధీటుగా కీలక పదవి పట్టినట్టే.
మరోవైపు, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ తారీక్ అన్వర్ తోనూ వెంకట్ రెడ్డి సమావేశం అవడం ఆసక్తికర పరిణామం. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై అన్వర్ తో కోమటిరెడ్డి చర్చించారు. ఆ ఆడియో వాయిస్ తనది కాదంటూ.. తానెలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదంటూ వ్యక్తిగతంగా వివరణ ఇచ్చారు.
పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీలో తనపై జరుగుతున్న రాజకీయాలకు హస్తిన లెవెల్ లో చెక్ పెట్టేలా అడుగులు వేస్తున్నారు. ఖర్గేతో ఏకంగా అరగంట పాటు వన్ టు వన్ భేటీ అయ్యారు. ఏఐసీసీ స్థాయి పదవిపై హామీ సాధించారు. అటు, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులనూ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఢిల్లీ నుంచి కీలక పదవితో.. తెలంగాణకు తిరుగొస్తారంటున్నారు కోమటిరెడ్డి అభిమానులు.