Etela Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు కీలక పదవి ఖాయమైందా? తెలంగాణలో పార్టీకి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతల్ని అధిష్టానం ఆయనకు అప్పగించబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే… ఔననే అనిపిస్తోంది. ప్రజల ఆశీర్వాదం దొరికే సమయం ఆసన్నమైందంటూ ఈటల ట్వీట్ చేయడం… ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో సైనికుడిలా పనిచేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం దొరికే సమయం సన్నమైందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా తనకు కీలక పదవి రాబోతోందన్న విషయాన్ని ఈటల రాజేందర్ ప్రకటించారని బీజేపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. అనేక కష్ట, నష్టాలకోర్చారని ఈటల తన ట్వీట్ లో పేర్కొన్నారు. అవమానాలు భరించారు.. త్యాగాలు చేశారని కూడా కొనియాడారు. పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారన్నారు. సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా గెలవాలని నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో.. ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పని చేస్తానన్నారు. ప్రజలకు అండగా ఉంటానని తన ట్వీట్ ద్వారా ఈటల రాజేందర్ హామీ ఇవ్వడం కొత్త చర్చకు దారి తీసింది.
ఈ వారంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మార్పుపై కీలక పరిణామాలు తప్పవన్న సంకేతాలను అధిష్టానం ఇచ్చింది. దీంతో ఈటలకు కీలక పదవి వస్తున్నందన్న ప్రచారం జోరందుకుంది. ఇలాంటి తరుణంలోనే ఈటల ట్వీట్ చేయడంతోపాటు.. ఎప్పుడూ లేని విధంగా హిందీలోనూ పోస్టు పెట్టడం.. అధిష్టానం తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తుందన్న అభిప్రాయాలకు బలాన్నిస్తోంది.