TS Highcourt: కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం వాదనలపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ప్లాన్పై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించగానే ఆ ప్రాంతంలో రైతులు ఆందోళనబాట పట్టారు. సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో రహదారులపై రాస్తోరోకో చేశారు. పట్టణానికి వచ్చే అన్నిదారులను మూసివేశారు. ఆ సమయంలో కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
రైతుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతంలో ప్రకటించారు. అలాగే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ లోనూ మాస్టర్ ప్లాన్ రద్దుపై తీర్మానం చేశారు. దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. మరి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ విషయంలో ఎలా ముందుకెళుతుందో చూడాలి. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుందా? రైతులు డిమాండ్లను నెరవేర్చుతుందా?