BRS : ఎన్నికల ముందుకు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ అసమ్మతి భగ్గుమంటోంది. గుర్రంపోడ్ జెడ్పీటీసీ గాలి రవికుమార్తోపాటు పది మంది సర్పంచులు, 12 మంది మాజీ సర్పంచులు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే భగత్ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే గుండబోయిన రామ్మూర్తియాదవ్ మనవడు.. కాషాయకండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో రంజిత్ యాదవ్ బీజేపీలో చేరనున్నారు. రంజిత్ యాదవ్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ముద్రపడింది.
ఇక సూర్యాపేట జిల్లా కోదాడలోనూ బీఆర్ఎస్కు దెబ్బపడింది. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ ముత్తవరపు పాండురంగారావు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. వారంతా ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో భేటీ కానున్నారు
ఇక నల్లగొండ మున్సిపాలిటీ వైస్ఛైర్మన్ సహా ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ను వీడనున్నారు. నిన్నటివరకు వీరంతా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డితో వీళ్లంతా టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరబాద్ లో గులాబీకి షాకులు తగులుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గట్టి దెబ్బపడింది. మాదాపూర్, హాఫీజ్పేట డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు జగదీశ్వర్గౌడ్, పూజిత జగదీశ్వర్గౌడ్ దంపతులు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
ఇప్పటికే శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్ను రఘునాథ్ యాదవ్ ఆశిస్తున్నారు. ఆయన ఇంటింటి ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజా కార్పొరేటర్ల చేరికతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి.