Student Suicide Case : హైదరాబాద్ నార్సింగ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. విద్యార్థి ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టింది. ఈ కమిటీ నివేదికలో కీలక అంశాలను పొందుపర్చింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో అతనికి అడ్మిషన్ లేదని వెల్లడించింది. ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మరో కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొంది.
అయితే కమిటీ రిపోర్టులో పేర్కొన్న దానికి భిన్నంగా సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. నార్సింగ్ లో ఉన్న శ్రీచైతన్య కళాశాల పేరుతో తమకు ఫీజు రశీదులు ఇచ్చారని తెలిపారు. తమ కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సాత్విక్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కళాశాలలో ఉపాధ్యాయుల వేధింపులు వల్ల అవమానం భరించలేక తరగతి గదిలో ఉరి వేసుకుని తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, సూసైడ్ నోట్ ఆధారంగా శ్రీచైతన్య కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచారి, ప్రిన్సిపల్ శివరామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శోభన్బాబు , హాస్టల్ వార్డెన్ నరేశ్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని రాజేంద్రనగర్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో నలుగురినీ చర్లపల్లి జైలుకు తరలించారు.