KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా క్షేతస్థాయి పర్యటనలు పెద్దగా చేపట్టరు. ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా కేసీఆర్ పొలంబాట పట్టారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఎకరానికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని రైతులు సీఎంను కోరారు. అయితే ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్తోపాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన వడగళ్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 2,28,255 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని కేసీఆర్ తెలిపారు. 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని వెల్లడించారు.
కేంద్రంపై విమర్శలు..
దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోందని కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేశారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని విమర్శించారు. దేశంలో వ్యవసాయానికి లాభం చేకూర్చే పాలసీలు లేవని మండిపడ్డారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నారన్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టపోయిన పంటలను పరిశీలించినా రూపాయి కూడా రాదన్నారు. కేంద్రానికి రాజకీయాలు తప్పితే రైతుల మీద ప్రేమ లేదని కేసీఆర్ మండిపడ్డారు. పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదని ఆరోపించారు.
అభివృద్ధి పథం..
రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అందుకే రైతులు అప్పుల ఊబి నుంచి బయటనపడుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువే ఉందని తెలిపారు. అద్భుతమైన వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవని దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరముందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.