TS Assembly Elections : తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్థులకు అంతుపట్టని విధంగా ఉంటాయి. ఒకటి మిస్ అయితే మరో ఆల్టర్నేటివ్ని వెంటనే రెడీ చేస్తారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్తో నెట్టుకొచ్చిన కేసీఆర్.. ఈ సారి తన రూట్ కాస్తా మార్చుకున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రాంతీయతత్వం వర్క్ అవుట్ అవ్వదనే అంచనాకు వచ్చిన కేసీఆర్ ప్రత్యర్థులను పెంచుకుంటూ పోయారు. ఇలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని భావించారు. నిజానికి ఇండియన్ పాలిటిక్స్ లో ఇదో సక్సెస్ ఫార్ములా. అయితే, నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో ఈ వ్యూహం వర్క్ అవుట్ అవుతుందని గులాబీదళం భావించింది. అందుకే కేసీఆర్ కూడా కాంగ్రెస్, బీజేపీలు బ్యాలెన్స్ డ్ గా ఉండేలా మేనేజ్ చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడూ షర్మిలను కూడా కావాలనే గులాబీదళం హైప్ చేస్తూ వచ్చింది. దీంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయి.. మరోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అనుకున్నారు.
తామొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్నట్టు.. కేసీఆర్ వ్యూహాలు పటాపంచలు అయ్యాయి. బీజేపీ స్వయంకృతాపరాదంతో రేసులో వెనకబడిపోయింది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరికొంత మంది కూడా గాంధీభవన్ వైపు చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఈ ఎన్నికలు క్లియర్ గా బీఆర్ఎస్ వెర్సెస్ కాంగ్రెస్ గా జరుగుతాయని సర్వేలతో పాటు రాజకీయ పండితులు కూడా చెబుతున్నారు. తెలంగాణలో చిన్నా చితకా పార్టీలు చాలానే ఉన్నాయి. కమ్యూనిస్టులు, వైఎస్ఆర్టీపీ, కోదండరాం టీజేఎస్.. ఇలా ప్రతీ ఒక్కరూ ఈసారి రేసులో ఉంటారని కేసీఆర్ భావించారు. చెరో ఒకటి, రెండు శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీల్చినా.. మినిమం మ్యాజిక్ ఫిగర్ గ్యారెంటీ అని బీఆర్ఎస్ నేతలే కాదు పొలిటికల్ అనలిస్టులు కూడా అనుకున్నారు. కానీ.. సీన్ మొత్తం రివర్స్ అయింది. రోజు రోజుకీ కాంగ్రెస్కు మద్దతు పెరుగుతోంది.
రేవంత్, కోదండరాం మధ్య చర్చలు ఫలించాయి. ఈ ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేయదని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. దీంతో.. బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. దీని నుంచి కోలుకోకముందే ప్రగతిభవన్ లో ప్రకంపనలు వచ్చే స్టేట్మెంట్.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇచ్చారు. తాము కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. కేసీఆర్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకూడదని ఆమె చెప్పారు. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నామని అన్నారు. ఇక.. కమ్యూనిస్టులతో కూడా చర్చలు పూర్తికాలేదని రేవంత్ ప్రకటించారు. అంటే.. కామ్రెడ్లను కూడా ఏదో రకంగా ఒప్పించే వ్యూహం గాంధీ భవన్లో రచిస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలు మరింత సన్నగిల్లడం ఖాయం.
టీడీపీ అనుకూల ఓటర్ల కూడా ఈసారి కేసీఆర్కు షాక్ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రి కేటీఆర్ కామెంట్స్ సెటిలర్స్ ని హర్ట్ చేసినట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి తెలంగాణలో ఇంకా ఓట్ బ్యాంక్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కింగ్ మేకర్ పాత్ర కూడా పోషిస్తుంది. అందుకే.. టీడీపీ అనుకూల ఓటర్ల కోసం అన్ని పార్టీలు తెగ ఆరాట పడుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్తో సెటిలర్స్ బీఆర్ఎస్ కు వ్యతిరేకమయ్యారు. బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయడమే కరెక్ట్ అనే అభిప్రాయానికి బాబు మద్దతు దారులు వచ్చారని తెలుస్తోంది. రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్ఎస్పై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు గులాబీదళం వ్యూహాలు కూడా బెడిసి కొడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైనట్టు కనిపిస్తోంది.