KCR : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. తొలుత మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తర్వాత బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కే ఈ ఘటనపై కేసీఆర్ మాట్లాడారు. మనం సమస్యలపై యుద్ధం చేస్తున్నామన్నారు. కానీ ప్రతిపక్షాలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయని ఆరోపించారు. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పిందని వెల్లడించారు.
ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ఈ చర్యలకు దిగుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కత్తితో తమ అభ్యర్థిపై దాడి చేశారని.. ఈ ఘటనపై తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి.
తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయని ఎప్పుడూ ఎవరూ కూడా హింసకు దిగలేదని కేసీఆర్ అన్నారు. ప్రజలు గెలిపిస్తే గెలిచామన్నారు. వీలైనంత ప్రజలకు సేవ చేశామని తెలిపారు. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదన్నారు.
సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై దాడి తనపై జరిగనట్లే భావిస్తానని అన్నారు. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇది రాజకీయమా? అని కేసీఆర్ ప్రశ్నించారు.