KCR : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. బీసీల్లో చేతివృత్తుల వారికి రూ. లక్ష, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థికసాయం అందించే పథకాల ఇప్పటికే ప్రకటించారు. దివ్యాంగుల పింఛన్ ను రూ. 4016కు పెంచారు. ఇటీవల జూనియర్ పంచాయితీ కార్యదర్శల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపారు. తాజాగా తెలంగాణలో వీఆర్ఏల వ్యవస్థపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 61 ఏళ్ల లోపు వయసున్న వారిని క్రమబద్ధీకరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లుగా వారిని నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక, వ్యవసాయ, విద్యాశాఖలకు కేటాయించాలని ఆదేశించారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలని నిర్దేశించారు.
61 ఏళ్లు దాటిన వీఆర్ఏలు రాష్ట్రంలో 3700 మందికిపైగా ఉన్నారు. వారి వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలిస్తారు. 2014 జూన్ 2 తర్వాత 61 ఏళ్లలోపు ఉండి వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వారి వారసులకు ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. విధివిధానాలు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు.
వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల్లో డిగ్రీ, ఆపై అర్హత గల వారిని జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తారు. అదే అర్హతతో పురపాలకశాఖకు కేటాయించే వారిని వార్డు అధికారులుగా నియమిస్తారు. ఇంటర్ అర్హత ఉన్న వారికి రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలిస్తారు. పదో తరగతి చదివిన వారిని సబార్డినేట్లు, హెల్పర్లుగా నియమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసినందుకు రుణపడి ఉంటామని వీఆర్ఏ జేఏసీ నేతలు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.