KCR : తెలంగాణలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పోడు భూములను సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలను అందించనుంది. సీఎం కేసీఆర్ శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలను అందజేస్తారు. 1.51 లక్షల మంది లబ్ధిదారులు పోడు పట్టాలను అందుకోనున్నారు.
అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులు కల్పిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఫారెస్ట్ కమిటీలను వేసి అర్హులైన పోడు రైతులను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామపంచాయతీల పరిధిలో ఈ ఫారెస్ట్ రైట్ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. ఫైనల్గా 4 లక్షల 5 వేల ఎకరాలకు సంబంధించి లక్షా 51 వేల మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులు అని సర్కారు గుర్తించింది.
మరోవైపు పోడు భూములకు పట్టాల కోసం తెలంగాణలో గిరిజనులు సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేశారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు పంపిణీ చేయనుంది. అయితే తమపై ఇప్పటి వరకు నమోదైన కేసుల పరిస్థితి ఏంటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పోడు పట్టాల కోసం రోడ్డెక్కిన తమపై.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేలకు పైగా కేసులు నమోదు చేశారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. గోండు వీరుడికి నివాళులర్పిస్తారు. తర్వాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కోట్నక్ భీమ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పోడు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలోనూ కేసీఆర్ ప్రసంగిస్తారు.