KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్ర కరణ్రెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది.
ఆషాఢమాసంలో దేవతలను పూజించే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు భారీగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.