KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న సీఎంకు..మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు
కేసీఆర్ చేరుకున్నారు.
అంజన్న ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోగానే పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్టను కేసీఆర్ పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేశారు.
ఆలయ సందర్శన తర్వాత కేసీఆర్..జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై చర్చిస్తున్నారు. కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.