BRS: ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పైపైన చూస్తే మామూలు న్యూసే అనిపించొచ్చు. కానీ, కేసీఆర్ తో కేజ్రీవాల్ చేతులు కలపడం రాజకీయంగా కీలక పరిణామం. దేశంలో బీజేపీని హార్డ్ కోర్ గా వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు అనేకం. అందులో అధికారంలో ఉన్నవి కొన్నే. బెంగాల్ లో మమతా, బీహార్ లో నితీష్, తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్. ఈ ఐదుగురిలో స్టాలిన్ మినహా ఆ నలుగురు ప్రధాని రేసులో ఉన్నారు. ఎవరికి వారే కాలం కలిసొస్తే ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని కలగంటున్నారు. అలాంటిది, కేసీఆర్, కేజ్రీవాల్ కలవడం మామూలు విషయంగా చూడలేం.
ఉత్తరాదిన బీజేపీ కాస్తైనా భయపడుతున్నది ఆప్ ని చూసే. ఢిల్లీని కొల్లగొట్టేసింది. పంజాబ్ లో పంజా విసిరింది. గుజరాత్ లో నానాహంగామా చేసింది. చండీగడ్ లో సత్తా చాటింది. యూపీలో ఉనికి చాటుతామంటోంది. ఇలా బీజేపీ అత్యంత బలంగా ఉన్న నార్త్ బెల్ట్ లో బీజేపీకి ధీటుగా దూసుకొస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. హనుమాన్ చాలీసా చదువుతూ.. మత రాజకీయాన్ని మతంతోనే ఎదురుదాడి చేస్తున్నారు కేజ్రీవాల్. ప్రధాని మోదీకి కరెక్ట్ మొగుడు ఎవరంటే కేజ్రీవాలే అంటారు చాలామంది బీజేపీ వ్యతిరేకులు. అందుకే, లెఫ్టినెంట్ గవర్నర్ రూపంలో ఢిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విధానాలకు అడుగడుగునా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ.
కట్ చేస్తే, అలాంటి కేజ్రీవాల్ ఖమ్మం బీఆర్ఎస్ సభకు రావడం.. కేసీఆర్ తో కలిసి జై కొట్టడం.. రాజకీయంగా కీలక పరిణామం. అసలు, మాటల మాంత్రికుడు కేసీఆర్.. కేజ్రీవాల్ కు ఏం చెప్పి బుట్టలో వేసుకున్నారా? అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రగతి కోసమే బీఆర్ఎస్ అని కేసీఆర్ అంటున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా అదే పని చేస్తున్నారు. మరి, ఆ ఇద్దరు దేశ్ కి నేతలు కలిసి.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? భవిష్యత్తులో పొత్తు ఉంటుందా? కలిసి పని చేస్తారా? అనేది ఆసక్తికరం.
కేసీఆర్ పాలనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేజ్రీవాల్ మాత్రం ఇప్పటివరకూ మిస్టర్ క్లీన్ గా ఉన్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నా.. ఆయన నిజాయితీపై ఎవరికీ అనుమానం లేదు. అదంతా బీజేపీ కుట్రనే భావిస్తున్నారు. అదే కవిత విషయం వచ్చే సరికి సీన్ అలా లేదు. స్కాంలో కవిత తప్పకుండా ఉండి ఉంటుందనే అనుకుంటున్నారు. మరి, ఇలాంటి పూర్తి విరుద్ధమైన భావాలు, స్వభావాలు ఉన్న ఆప్, బీఆర్ఎస్ లు ఎలా ఒక్కతాటిపైకి వచ్చాయి? కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరు సీఎంలు మోదీపై ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు? రెండు చిన్న రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్న ఈ ఇద్దరూ.. బాహుబలిలాంటి బీజేపీని ఎలా చిత్తు చేయగలరు? వీరితో కలిసొచ్చేది ఎవరు? వీరికి అడ్డు తగిలేది ఇంకెవరు? ఇలా అనేక ప్రశ్నలు.
ప్రధానిగా కేసీఆర్ కావాలా? కేజ్రీవాల్ కావాలా? అని దేశ ప్రజలకు పోల్ పెడితే.. ప్రస్తుతానికైతే అంతా కేజ్రీవాల్ కే ఓటేస్తారు. కేసీఆర్ తో పోలిస్తే అంతకుమించి ఇమేజ్ కేజ్రీవాల్ సొంతం. అలాంటిది తనకు పోటీ వస్తారని, తనను మించిపోతారని భావించకుండా.. తనకన్నా మంచి పాపులారిటీ ఉన్న కేజ్రీవాల్ ను తనకు తోడుగా కలుపుకోవడం చూస్తుంటే.. కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అనే మాట నిజమే అనిపిస్తుంది. అయితే, ఈ కలయిక, ఈ నమ్మకం ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.