మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు.. కేబినెట్ మంత్రులు, పలువురు నేతలు హాజరయ్యారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానన్నారు పట్నం మహేందర్ రెడ్డి.
పట్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది రెండోసారి. తొలిసారి ఆయన రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు.
మహేందర్రెడ్డి మామూలు లీడర్ కాదు. 1994, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2019, 2022లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మహేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన తమ్ముడు పట్నం నరేందర్రెడ్డి కొండంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం ఫ్యామిలీకి గట్టి పట్టుంది. తాండూరులో ఓడిపోవడంతో పొలిటికల్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయింది. ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలెట్ రోహిత్రెడ్డి కింగ్ మేకర్ కావడం, సిట్టింగ్ కోటాలో ఆయనకే బీఆర్ఎస్ టికెట్ రావడంతో పట్నం బాగా హర్ట్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీని గెలిపించే సత్తా ఉన్న నేత కావడంతో.. సీఎం కేసీఆర్ వెంటనే అలర్ట్ అయ్యారు. మిగతా నేతల్లా వచ్చేసారి చూద్దాం.. ఆ పదవి ఇస్తాం.. అంటూ మాయమాటలు చెబితే వినే లీడర్ కాదు పట్నం మహేందర్రెడ్డి. ఫుల్ ఫైర్ ఉన్న నాయకుడు. అందుకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. అసలేమాత్రం ఆలోచించకుండా.. వెంటనే ఆయన్ను కేబినెట్లోకి తీసుసుకున్నారు సీఎం కేసీఆర్.
అదేంటి? ప్రభుత్వానికి ఇంకా మూడు నెలల గడువు కూడా లేదు.. మరి ఈ మూడ్నాళ్ల ముచ్చటేంది? అని అంతా అవాక్కయ్యారు. అయినా, కేసీఆర్ ఇచ్చేశారు. ఆయన తీసేసుకున్నారు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఐదేళ్లుగా పక్కనపెట్టేశారనే భావన కూడా లేదు. మంత్రి పదవి అనగానే.. ఇన్నాళ్లూ కేసీఆర్ లైట్ తీసుకున్న విషయాన్ని మర్చిపోయారు. మీరే మా బాస్ అంటూ కేబినెట్లో చేరిపోయారు. మూడు నెలలేగా అని తక్కువ చూట్టానికి లే. మంత్రి మంత్రే. ఈ మూడు నెలల్లో ఎన్ని పనులైనా చేసేయొచ్చు.. ఎంతైనా సంపాదించుకోవచ్చు..అనేది ఆయన లెక్క కావొచ్చు. ఎవరి లెక్కలు వారికున్నా.. అవసరం లేనప్పుడు కరివేపాకులా పక్కనపడేయడం.. అవసరం రాగానే.. మళ్లీ నెత్తి మీద పెట్టుకోవడం.. గులాబీ బాస్కు తెలిసినంత మరెవరికీ తెలీకపోవచ్చని అంటున్నారు. డౌట్ ఉంటే కమ్యూనిస్టులను అడగండి చెబుతారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కేసీఆరా..మజాకా!