KCR : కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ మరోసారి సిద్ధమైంది. పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వంపై గళమెత్తాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో
3గంటలపాటు గులాబీ బాస్ చర్చించారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి బడ్జెట్లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక అంశాలపై ఆంక్షలు విధించడం, రైతుల విషయంలో వివక్ష చూపడం లాంటి అంశాలను
దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు.
రాష్ట్ర విభజన హామీలు అమలు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, ఆర్థికపరమైన అంశాలపై రాజీలేని పోరాటం చేయాలని ఎంపీలకు కేసీఆర్ నిర్దేశించారు. దేశంలోని జాతీయ సమస్యలపై పోరాటం చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందన్న విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపైనా పార్లమెంట్ లో గళమెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
సానుకూలంగా ఉన్న పార్టీలతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలని ఎంపీలకు కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో కంటే దూకుడుగా వెళ్లాలన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో బలం చూపించేందుకు ఇలా వ్యూహాలను సిద్ధం చేశారు. జాతీయస్థాయిలో వివిధ పార్టీలను కలుపుపోయే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. ఈ వ్యూహం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో? చూడాలి.