BRS: బీఆర్ఎస్ ప్రారంభమైంది. కేసీఆర్ సంతకంతో భారత్ రాష్ట్ర సమితి ఉనికిలోకి వచ్చింది. జెండా కూడా రెడీ. ఇక, ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరడమే తరువాయి అంటున్నారు గులాబీ బాస్. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనేది బీఆర్ఎస్ నినాదమన్నారు కేసీఆర్. ఢిల్లీలో ఈ నెల 14న భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమని.. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం తీసుకొస్తామని.. జాతీయ స్థాయిలో కొత్త పర్యావరణ విధానం కావాలన్నారు. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఉండవన్నారు కేసీఆర్.
“నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఏర్పాటు సమయంలోనూ ఎన్నో విమర్శలు చేశారు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించాం. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు కాదు.. రాజకీయ పార్టీలు.” అన్నారు గులాబీ బాస్.
కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారని.. తెలుగువాళ్ల కోసం బీఆర్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని.. కుమారస్వామి మళ్లీ కర్ణాటక సీఎం కావాలని ఆకాక్షించారు కేసీఆర్.