Kcr Medigadda : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి కోర్టుకు డుమ్మా కొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. దీనిపై గతంలో రెండు సార్లు భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్తో సహా పలువురికి సమన్లు జారీ చేసింది. కాగా, కేసీఆర్, స్మితా సభర్వాల్ మినహా సమన్లు అందుకున్న వారందరి తరపున వారి లాయర్లు గతంలో కోర్టుకు హజరయ్యారు. కానీ, మూడోసారి కూడా కేసీఆర్ ఈ సమన్లకు స్పందించలేదు.
నోటీసుల బేఖాతర్ –
ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు 8 మందికి ఆగస్టు మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. అయితే, సెప్టెంబరు 5న మాజీ మంత్రి హరీశ్రావు తరపున న్యాయవాదులు లలితా రెడ్డి, సుకన్య.. కాంట్రాక్ట్ సంస్థ మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఎల్ అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవధాని, శ్రావణ్ రావు.. ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తరఫున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు. కానీ, మాజీ సీఎం కేసీఆర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తరపున న్యాయవాదులెవ్వరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో అక్టోబరు 17కు కేసును వాయిదా వేస్తూ జిల్లా జడ్జి నారాయణబాబు ఉత్తర్వులిచ్చారు. కానీ, గురువారం కోర్టుకు మరోసారి కేసీఆర్, స్మితా సబర్వాల్ డుమ్మా కొట్టటం చర్చగా మారింది.
న్యాయపోరాటం ఆగదు: రాజలింగమూర్తి
చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని పిటిషినర్ రాజ లింగమూర్తి మీడియాతో అన్నారు. భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పారు. ఇకనైనా బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా కేసీఆర్ కోర్టుకు వచ్చి, వాస్తవాలు వివరించాలని ఆయన కోరారు.