KCR Letter To CM Revanth Reddy: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఆహ్వానించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్సవాలకు మాజీ సీఎం హాజరవుతారా లేదా అని అటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో అలు తెలంగాణ ప్రజానీకం ఎదురుచూసింది.
చావు కబురు చల్లగా చెప్పినట్లు మాజీ సీఎం కేసీఆర్ తాను వేడుకలకు హాజరుకాబోనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరిదయా భిక్ష కాదని.. అలాంటి తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తెరదీసిందని అన్నారు. ఇలాంటి భావా దారిద్య్రాన్ని నిరసిస్తున్నానంటూ కేసీఆర్ లేఖ ప్రారంభించారు.
“ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పంపిన నేపథ్యంలో నేను బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాటం అని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్రాన్ని మొట్ట మొదట నిరసిస్తున్నాను. చరిత్ర పొడగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచినా దాగని సత్యం. బీఆర్ఎస్ పాత్ర ఎంటో ప్రజలకు తెలుసు. ప్రజా పాలన అని చెబుతూ ఒక్క హామీ నెరవేర్చలేదు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉత్తేజకరమైన సందర్భమే.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనడం సమంజసం కాదు. బీఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణవాదుల్లో ఈ అభిప్రాయం బలంగా ఉంది. ప్రజా జీవితాన్ని కల్లోలంలోకి నెడుతున్న కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఉత్సవాల్లో నేను పాల్గొనటం లేదంటూ ” కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.