Telangana Elections : ఎన్నికల్లో గెలుపోటములపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడటం… తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ భూమ్మీదకు ప్రతీ ఒక్కరూ ఎక్స్పైరీ డేట్తో వస్తారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అధికారం శాశ్వతం అని అహంభావంతో ఎవరైనా అనుకుంటే వారు అజ్ఞానులే అని పేర్కొన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి పోవాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాము కూడా ఇంటికి పోవడానికి రెడీగానే ఉన్నామని కేటీఆర్ అన్నారు. కానీ BRS కన్నా ఇతర పార్టీలు మెరుగైన పరిపాలన ఇవ్వలేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఎలక్షన్స్ ఓన్లీ ఫర్ రిజెక్షన్, నాట్ ఫర్ సెలక్షన్” అనే సామెతను చెప్పారు. ప్రజలు విసిగిపోతే ఏ పార్టీనైనా ఇంటికి పంపిస్తారని చెప్పారు.
పదేళ్ల పాలనలో అలకలు, అసంతృప్తులు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కేటీఆర్ తెలిపారు. తాము దేవుళ్లం కాదు.. చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసి ఉంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పది రోజుల కిందట సీఎం కేసీఆర్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ఓడిస్తే పోయేదేం లేదు, రెస్ట్ తీసుకుంటానని కేసీఆర్ అచ్చంపేట సభలో అన్నారు. ఓటమి ఖాయమన్న భావనతోనే కేసీఆర్, కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.