KCR : సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో ప్రతిపక్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని.. గతంలో అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు చెందిన చాలా మంది నేతలు మంత్రులుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో సూర్యాపేటను అభివృద్ధి చేశారా? అని నిలదీశారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అనుకున్నారా? అని ప్రశ్నించారు.
ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని కేసీఆర్ మండిపడ్డారు. రూ.4 వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీస్తున్నారని మరి ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రూ.4 వేలు పింఛను ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తాము పింఛన్లు తప్పకుండా పెంచుతామని హామీఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో అప్పుడే విద్యుత్ కోతలు మొదలయ్యాయని ఆరోపించారు.
ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని.. ధరణి పోర్టల్ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని కేసీఆర్ నిలదీశారు. ఓటు అనే ఆయుధాన్ని బాగా ఆలోచించి వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గెలుపుపై
అనుమానమే లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికలకంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
సూర్యాపేటకు కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు , జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించారు. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేటలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నిర్మించాలని మంత్రి ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని కేసీఆర్ అన్నారు.