రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై దాదాపు కసరత్తు పూర్తిచేసిన బీఆర్ఎస్. అందుకు అనుగుణంగా ముందుగానే నాయకులను సన్నద్ధం చేస్తోంది . సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇతర పార్టీ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరిన వారున్న చోట.. మొదటి నుంచీ పార్టీలో ఉంటూ టికెట్ కోసం పోటీపడుతున్న వారిని పిలిపించి మాట్లాడుతోంది అధిష్ఠానం. మళ్లీ ప్రభుత్వం రాగానే కీలక పదవులు ఇస్తామని ఆశ చూపిస్తోంది. అసంతృప్త నేతలకు నచ్చజెప్పి ఒప్పించే పనిలో నిమగ్నమైంది అధినాయకత్వం.
మొదటి విడత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసింది గులాబీ పార్టీ. టికెట్కు రాని నేతల్లో అసంతృప్తి తలెత్తకుండా.. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ముందుగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి అధినేత కేసీఆర్తో మాట్లాడిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులతో ఇటీవల చర్చించి వారిని పార్టీ మారకుండా చూసినట్లు తెలుస్తోంది.
ఇలా సర్దిచెప్పే ప్రయత్నాలు ఎక్కువ నియోజకవర్గాల్లో సఫలీకృతమైనట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. బుజ్జగించినా ఆయా నాయకుల్లో మార్పు రాకుంటే.. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులపై ప్రభావం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు గులాబీ నేతలు.
కాంగ్రెస్కు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. హస్తం పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగే నియోజకవర్గాలపైనా దృష్టిపెట్టింది. కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న చోట్ల బలమైన నేతలను బరిలోకి దింపే యోచనలో గులాబీ పార్టీ ఉంది.