Kodangal : కొడంగల్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ నియోజకవర్గం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తుండటమే ఇందుకు కారణం. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ నిన్న కొడంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా సభలు, సమావేశాల్లో ప్రసంగించిన కేసీఆర్… నిన్న కొడంగల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. గత తొమ్మిదేళ్లలో రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొడంగల్పై బీఆర్ఎస్ పార్టీ.. ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పెషల్ నజర్ పెట్టినట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా అయిన కొడంగల్లో ఆయనను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీని కోసం కొడంగల్ను ఏకంగా దత్తత తీసుకుంటానని ప్రకటించారు కేసీఆర్. కొడంగల్ అభివృద్ధి తన బాధ్యత అంటున్నారు కేటీఆర్. సిరిసిల్లకు ధీటుగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు ఆయన.
కొడంగల్లో గెలుపు కోసం నియోజకవర్గ అభివృద్ధితో పాటు.. రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. రేవంత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కొడంగల్ ప్రజల మనోగతం మాత్రం మరోలా ఉంది. కొడంగల్ అభివృద్ధి.. దత్తత మాటలు పాతవే కదా అంటున్నారు అక్కడి ప్రజలు. అంతేకాదు సీఎం కేసీఆర్ గతంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి జరిగిందో అందరికి తెలుసని డైరెక్ట్గానే చెబుతున్నారు.
మరోవైపు పదేళ్ల నుంచి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఏమాత్రం సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. కోస్గి, మద్దూరు, కొడంగల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రాలేదంటున్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప.. ఈ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.