KCR : గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాసంలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ పక్కా లెక్కలు వేస్తున్నారు. కసరత్తు పూర్తైతే.. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి లిస్ట్ ప్రకటిస్తారని సమాచారం. ఎర్రవల్లి ఫౌంహౌస్ లో మకాం వేసిన కేసీఆర్..కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. సర్వేల ఆధారంగా కేసీఆర్ గెలుపు గుర్రాలను ఖారారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ నుంచి కొందరు పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చిందని తెలుస్తోంది. ఆయా ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయాలు, ప్రతికూలాంశాల చిట్టాను ముందుపెట్టి క్లాస్ తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన చాలామంది సిట్టింగ్ లకు ఇటీవల కేసీఆర్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. అందులో ఎక్కువ మంది నెగెటివ్ రిపోర్ట్ తో ఉన్న వారే కావడంతో.. మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో భయం మొదలైంది. ఎప్పుడు సార్ నుంచి కాల్ వస్తుందా..? గుడ్ న్యూస్ వింటామో.. బ్యాడ్ న్యూస్ వింటామోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
కొందరు మంత్రులకు స్థానం చలనం ఉంటుందని తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అమాత్యులను వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతారని అంటున్నారు. తీవ్ర వ్యతిరేకత ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ దక్కదని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇక నాలుగు నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టారు. ఒకవైపు కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇక ప్రచారం పర్వం ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది.