KCR Absent for Telangana Budget Session 2024: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతారని నేతలు ఎదురు చూశారు. మూడో రోజు సమావేశాలు జరుగుతున్నా.. కేసీఆర్ మాత్రం ఇంకా అసెంబ్లీకి రాలేదు. ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ మళ్లీ డుమ్మా కొట్టారు కేసీఆర్.
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ హాజరు కాకపోవడంపై అధికార పార్టీ నేతల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన తీరుని తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి బడ్జెట్ సమావేశానికీ వెళ్లలేదు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి కూడా హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశానికి వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి ఎందుకు రాలేదని అధికార పక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లినప్పుడు సహకరించిన ఆరోగ్యం కేసీఆర్ కు అసెంబ్లీ సమావేశాలకు రావడానికి సహకరించదా..? అని అధికార పక్ష నేతలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ బీఏసీ సమావేశానికి సైతం హాజరు కాలేదు. కేసీఆర్, కడియం శ్రీహరి హాజరవుతారని ముందుగానే బీఆర్ఎస్ పార్టీ పేర్లు ఇచ్చింది. అయితే ఆ సమావేశానికి మాత్రం ఆయన స్థానంలో హరీశ్ రావు వెళ్లారు. నిబంధనల ప్రకారం పేర్లిచ్చిన వారే రావాలని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమివ్వగానే హరీశ్ రావు వెనుదిరిగారు. కావాలనే కేసీఆర్ బదులు హరీశ్ ను పంపారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Read More: ‘నాడు కుటుంబ పద్దు.. నేడు ప్రజల పద్దు..’
మరోవైపు ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో కేటాయించిన చాంబర్ పై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హోదాను బట్టి నిబంధనల ప్రకారమే చాంబర్ ను స్పీకర్ కేటాయిస్తారని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ విధంగానే కేసీఆర్ కు చాంబర్ ని కేటాయిస్తామని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరైంది కాదని క్లారిటీ ఇచ్చారు. చాంబర్ కేటాయింపును కూడా రాజకీయం చేయడమేంటని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.
రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా ప్రవర్తించడంపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు హాజరై ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇష్టారీతిలో వ్యవహరించడం సరికాదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా హూందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు రావాలని కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించలేక పోవడంతోనే భయంతో రావడం లేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు రావాలని కేసీఆర్కు ఆహ్వానం పంపారు.ఈ బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అప్పగించారు.