BRS Mahbubnagar MP Candidate: మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.
ఇవ్వాళ కేసీఆర్తో భేటీ అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ సీటును బీఎస్పీకి కేటాయిస్తారని సమాచారం. బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కారు దిగి కమలం గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఇక మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై 77,829 మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మన్నె శ్రీనివాస్ రెడ్డికే అవకాశం ఇచ్చారు.
Read More: బీఆర్ఎస్ రెండో లిస్ట్ విడుదల.. ఎంపీ అభ్యర్థులుగా నామా, కవితకు అవకాశం..
ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగనున్నారు.