AP BRS: దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దేశంలోని దళితులు అందరికీ దళిత బంధు ఇస్తాం. విశాఖ ఉక్కును కేంద్రం అమ్మితే అమ్మమనండి.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కును తిరిగి కొంటాం.. కేంద్రానిది ప్రైవేటైజేషన్ అయితే.. మాది నేషనలైజేషన్.. అంటూ ఏపీ బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ప్రారంభించారు కేసీఆర్. తోట చంద్రశేఖర్ కి ఏపీ బాధ్యతలు అప్పగించారు. రావెల కిశోర్ బాబు సేవలను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు.
సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ బిజీగా ఉంటుందని.. చాలా మందికి ఆశ్చర్యం కలిగించే చేరికలు జరగబోతున్నాయని చెప్పారు కేసీఆర్. సిట్టింగులో ఉన్నవాళ్లు కూడా బీఆర్ఎస్ లో చేరుతామంటూ ఫోన్లు చేస్తున్నారని బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఏపీలో కూడా అసలుసిసలు ప్రజాస్వామ్యం రావాలని.. ఏపీకి మేమే కర్తలం, భర్తలం అనే ధోరణి పోవాలని.. ఏపీ వాసులు బీఆర్ఎస్ కోసం ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు కేసీఆర్.
బీఆర్ఎస్ ఫర్ ఇండియా.. ఇండియా విల్ రియాక్ట్స్.. అంటూ ఏపీ బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ప్రారంభించారు కేసీఆర్. అధికారంలోకి రావడం మాత్రమే కాదని.. దేశ ఆలోచనా సరళి మార్చి, ఉజ్వల భారత్ కోసం.. సమాజాన్ని, ప్రజలను రెడీ చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే.. రెండేళ్లలో వెలుగు జిలుగుల భారతదేశం చేసి చూపిస్తామన్నారు. సంక్రాంతి మర్నాటి నుంచి 7, 8 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కమిటీలు ప్రకటిస్తామని చెప్పారు కేసీఆర్.