KCR: 100+. కేసీఆర్ ఎలక్షన్ టార్గెట్ ఇది. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా గెలుస్తాం. ఇదీ గులాబీ బాస్ స్టేట్మెంట్. ఈజీగా చెప్పేశారు వందకు పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలిచేస్తామని. గెలుపు పెద్ద టాస్కే కాదని.. ఎక్కువ సీట్లు రావడమే ఇంపార్టెంట్ అన్నారు. కేసీఆర్ ధీమా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించి తీరుతామంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఈసారి తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అని కమలనాథులు విజయోత్సాహంతో చెబుతున్నారు. విపక్ష రాజకీయం సైతం యమ దూకుడుగా సాగుతోంది. విమర్శలు, ఆందోళనలతో సర్కారుకు దాదాపు ప్రతీరోజూ చుక్కలు చూపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ను వీడే వారి సంఖ్య పెరుగుతుండగా.. ప్రతిపక్ష పార్టీల్లో చేరికలకు ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో 100+ టార్గెట్ సాహసమే అంటున్నారు.
కాంగ్రెస్ ఇప్పటికీ సంస్థాగతంగా బలంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ పార్టీకి పెట్టని కోట. ఖమ్మం జిల్లాలో పొంగులేటి చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆయనొస్తే.. హస్తం పార్టీకి జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. మెదక్, ఆదిలాబాద్, వరంగల్.. ఇలా అనేక ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ఉనికి చాటుకునే అవకాశం లేకపోలేదు. అయినా బీఆర్ఎస్కు వంద ప్లస్ అంటున్నారు గులాబీ బాస్.
బీజేపీ సైతం ఫుల్ జోష్ మీదుంది. కాషాయం పార్టీ తామే అధికారంలోకి వస్తామంటోంది. అంత సీన్ లేదు.. బీజేపీకి 119 స్థానాల్లో పోటీకి అభ్యర్థులు ఉన్నారా? అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే, మోదీకి ఉన్న క్రేజ్, బీజేపీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. 20-30 సీట్లు వచ్చినా రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయినా.. వందకు మించి టార్గెట్ పెట్టుకున్నారు కేసీఆర్.
ఇదెలా సాధ్యం? కాంగ్రెస్ బలంగా ఉంది.. బీజేపీ బలపడుతోంది.. మరి, కేసీఆర్ పార్టీకి అన్నేసి సీట్లు ఎలా వస్తాయి? ఆయన ధీమా ఏంటి? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. కేసీఆర్ కాన్ఫిడెన్స్కు కారణం విపక్షాలే అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్కు పడే ఓట్లు ఎలాగూ పడతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎవరికి పడతాయనేదే కీలకాంశం. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ప్రజలను ఆకట్టుకుంటుండటంతో.. ఆ వ్యతిరేక ఓటు రెండు పార్టీల మధ్య చీలిపోవడం ఖాయం అంటున్నారు. అది పరోక్షంగా గులాబీ పార్టీకే అడ్వాంటేజ్గా మారుతుందని లెక్కేస్తున్నారు. ఆ లెక్క ప్రకారమే.. ఈసారి 100 తగ్గేదేలే అంటున్నారు కేసీఆర్.