Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ట్విస్ట్ లు మీద టిస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీలో ఆప్ సర్కార్ ను ముచ్చెమటలు పట్టిస్తున్న సీబీఐ ..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. శుక్రవారం సీబీఐ నుంచి నోటీసులు రాగానే కవిత స్పందించారు. సీబీఐ తనను వివరణ మాత్రమే కోరుతుందని తెలిపారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే సీబీఐకి వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి.
లేఖతో ట్విస్ట్
శనివారం ఉదయం ప్రగతిభవన్ కు కవిత వెళ్లడం ఆసక్తిని రేపింది. సీఎం కేసీఆర్ తో ఆమె సుధీర్ఘంగా చర్చించారు. తండ్రితో చర్చలు తర్వాత కవిత తన వ్యూహాన్ని మార్చారు. మరో ట్విస్ట్ ఇచ్చారు. సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్తోపాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని కోరారు. డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఫిక్స్ చేద్దామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతిని సీబీఐ కోర్టులోకి విసిరారు.
నోటీసులు అందగానే ఇలా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్లో కవిత పాత్రపై సీబీఐ, ఈడీ సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో ఆమెను విచారించేందుకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ అధికారి అలోక్ కుమార్.. కవితకు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6న విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై కవిత స్పందించారు. హైదరాబాద్ లోని నివాసంలో తనను ప్రశ్నించాల్సిందిగా సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని వెల్లడించారు. అయితే కేసీఆర్ తో భేటీ తర్వాత సీబీఐకి కవిత లేఖ రాయడం ఆసక్తిని రేపుతోంది. అంటే సీబీఐ ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు ఇస్తేనే విచారణకు కవిత సహకరిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ సీబీఐ ఆ కాపీలను ఇవ్వకపోతే ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. కవిత షరతులను సీబీఐ అంగీకరిస్తుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరి సీబీఐ ఈ కేసులో ఎలా ముందుకెళుతోందో చాడాలి.
కేసు నేపథ్యం
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కవిత పాత్ర ఉందని.. ఆ పాలసీని రూపొందించే సమయంలో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమేనని ఈడీ వర్గాలు ఇటీవలే సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ కవితకు సమన్లు జారీ చేసింది. ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఏంటి? ఆమెతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వీరు ముడుపులను ఎవరికి ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే వివరాలను కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈడీ అధికారులు స్పష్టంగా వివరించారు. దీంతో తెలుగు రాష్ట్రాలో ఢిల్లీ మద్యం కేసు రాజకీయ ప్రకంపనలు రేపింది. ఇంకా ఎవరెవరికి సీబీఐ నోటీసులు జారీ చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది.