Kavitha : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై టెన్షన్ కొనసాగుతోంది. ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. కవిత ప్రెస్మీట్ పెడతారని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈడీ విచారణకు వెళతారని అందరూ భావించారు. అయితే కవిత ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. ప్రెస్మీట్ పెట్ట లేదు.. విచారణకు హాజరుకాలేదు. అసలు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కవిత బయటకు కూడా రాలేదు. కానీ ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్తో పంపించారు. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఈడీకి సమాచారమిచ్చారు. కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చింది. విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో కవిత స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కవిత న్యాయవాది సోమా భరత్ కీలక విషయాలను ప్రస్తావించారు. మహిళలను ఇంటి వద్ద మాత్రమే ప్రశ్నించాలన్నారు. ఈ నెల 11న రాత్రి 8 గంటల వరకు కవితను ఈడీ అధికారులు విచారించారని గుర్తు చేశారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి వద్దే ప్రశ్నించాలన్నారు. సాయంత్రం 6 గంటలోపే విచారణ పూర్తి చేయాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి వద్ద ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందన్నారు. కానీ చట్ట ప్రకారం మహిళను ఇంటి దగ్గరే విచారణ జరపాలని స్పష్టం చేశారు.
రాజకీయ కారణాలతో కవితను కేంద్రం ఇబ్బంది పెడుతోందని సోమా భరత్ అన్నారు. కవిత పంపిన లేఖను ఈడీకి అందించానన్నారు. కవిత విచారణకు రాకపోతే ఈడీ తీసుకునే స్టెప్ ఏంటి? ఈ విషయమే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.