Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు రావడం తెలంగాణలో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ప్రగతి భవన్కు కవిత వెళ్లడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు సీబీఐ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నమోదు చేసిన ఆర్సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ కవిత నివాసంలో విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు. తన వివరణ కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో వివరణ ఇస్తానని సీబీఐ అధికారులకు తెలియజేశానని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ప్రగతి భవన్కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కవిత ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించారని సమాచారం. అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రాజకీయంగా ఎలా ఎదుర్కొవాలన్న దానిపై కేసీఆర్ తో కవిత చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ కార్యకర్తలకు కవితకు సంఘీభావం తెలుపుతున్నారు. హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్దకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.